హైదరాబాద్, 11-02-2019: పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి. ఈ ఆస్పత్రికి నగరం నుంచే కాకుండా తెలంగాణ జిల్లాలతో పాటు కర్నాటక రాష్ట్రం నుంచి రోగులు వస్తుంటారు. రిఫరల్ ఆస్పత్రిగా పేరుగాంచిన ఈఆస్పత్రికి మాత్రం వైద్యుల లేమి తీవ్రంగా ఉంది. ప్రస్తుతమున్న వైద్యులు రోగులకు సేవలు అందించడానికి ఏమాత్రం సరిపోరని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. ఈ ఆస్పత్రిలో ప్రతీ రోజు వెయ్యి మందికిపైగా అవుటు పేషం ట్లు, ఏడు వందలకుపైగా ఇన్పేషంట్లు చికిత్సలు తీసుకుంటున్నారు. ప్రస్తుతమున్న స్టాఫ్కు సమానంగా అదనపు స్టాఫ్ అవసరమని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.
వార్డుకు ఒకరు కూడా లేని పరిస్థితి
ఈఆస్పత్రిలో 24 వార్డులు ఉంటే వార్డుకు కనీసం ఇద్దరు వైద్యులు కూడా లేని దుస్థితి నెలకొంది. నిత్యం వంద డెలివరీలు జరిగే ఈ ఆస్పత్రికి వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ అంతంత మాత్రమే ఉన్నారు.
మూడు షిఫ్టులకు కలిపి 35 మంది వైద్యులే….
రోగులకు సరిపడు వైద్య సిబ్బంది లేకపోవడం ఇబ్బందులు తలెత్తుతోన్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆరుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 18 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ఆర్ఎంఓలు, ఒక సూపరింటెండెంట్ ఉన్నారు.
అదే దారిలో నర్సింగ్ స్టాఫ్
డాక్టర్ల మాదిరిగానే నర్సింగ్ స్టాఫ్ది అదే పరిస్థితి. ఇక్కడ 24 వార్డులకు కేవలం 120 మంది నర్సులు మాత్రమే ఉన్నారు. ఈ 120 మంది మూడు షిఫ్టుల్లో డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో షిప్టుకు 40మంది నర్సులు మాత్రమే ఉంటున్నారు. దీంతో మహిళా రోగుల బాగోగులు చూసే నర్సులు తక్కువగా ఉండడంతో వార్డుల్లో ఇద్దరు, ముగ్గురే కనిపిస్తున్నారు. నర్సుల కొరత కారణంగా వార్డుకు ఉదయం నలుగురు, మధ్యాహ్నం ఇద్దరు, రాత్రి ఇద్దరు నర్సులను నియమిస్తున్నారు.